2, మార్చి 2012, శుక్రవారం

అక్షరాయుధంతో అలుపెరుగని పోరు

            పౌర స్వేచ్ఛ అసలే లేని నియంతృత్వ నిజాం పాలనలో నిత్యమూ నిజాల్ని తెలిపేందుకు పత్రికల్ని ప్రచురించటం సాహసాల్లోకెల్లా సాహసం.. ఎడ్ల బళ్లు కూడా వెళ్లలేని ఊళ్లలో చాప్‌ఖానాలు (ప్రింటింగ్ ప్రెస్)ఆరంభించి పత్రికల్ని ప్రచురించటం తెలంగాణాలోనే సాధ్యమైంది. పక్కనే ఉన్న కోస్తాంధ్ర మేధావులు పలకరించకున్నా మొక్కవోని ధైర్యంతో తెలుగు తేజాన్ని అక్షర వేదికపై పత్రికా పాత్రలతో ప్రదర్శింపజేసిన మేధావులు ఆనాటి తెలంగాణా సంపాదకులు. ఎప్పుడో పాలమూరు నుంచి హితబోధినితో ఆరంభమైన తెలంగాణా పత్రికా ప్రస్థానం విశాలాంధ్ర అవతరణ వరకు తనదైన విశిష్ట వ్యక్తిత్వంతో విలక్షణ అస్తిత్వంతో వెలుగుదారుల్ని నిర్మిస్తూ పోయింది. మన పాత్రికేయులు మన ప్రతిభామూర్తులు. పెట్టుబడులు లేవు.. సొమ్ములు లేవు.. పైగా నిషేధాల సీమ. అంత నిర్బంధంలో పాత్రికేయ వృత్తిని ధర్మంగా, బాధ్యతగా స్వీకరించి ఒంటి చేత్తో నడిపించారు. ఇక్కడి పత్రికారంగం ఉద్యమాల్లో నెత్తురోడింది. ముష్కర రాజరికాన్ని నిర్నిరోధంగా ఎదురొడ్డి పోరాడింది.. మృత్యుకీలల్లో ఆహుతైనా సరే.. వెనుకడుగు వేయకుండా అధిక్షేపాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణా ప్రాంతంలో పత్రికల ప్రస్థానం ఒక పోరాటం.. ఒక ఉద్యమం.. జాతి అస్తిత్వం.. భాష అస్తిత్వం.. ఇక్కడి పత్రికల భాష మెతుకు భాష.. ఇక్కడి పత్రికల వాసన రైతు స్వేదన. ఇక్కడి పత్రికల రంగు ఏడువందల సంవత్సరాలుగా పాలకుల దాష్టీకంపై తెలంగాణా ప్రజలు నిరంతర పోరాటంతో చిందించిన రుధిరం.
....
1891 జూలై 5వ తేదీన హిందూ పత్రికలో ఒక వార్త వచ్చింది. అది నైజాం రాజ్యంలోని గుల్బర్గా నుంచి ఓ విలేఖరి రాసింది.. అందులో నైజాం రాజ్యంలో ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ‘‘గవర్నర్ జనరల్ పాలనలో ఉన్నప్పటికీ, బ్రిటిష్ ఇండియాలో లేని’’ ప్రాంతం అని స్పష్టంగా అందులో రాశారు. అంటే హైదరాబాద్ సంస్థానం అప్పటికీ స్వతంత్రంగా ఉంది. ఇదే విలేఖరి ఓ బ్రిటిష్ అధికారిని కలిసి హైదరాబాదులో పత్రిక పెట్టుకోవటానికి అనుమతి కోరితే.. మీకు అనుమతి దొరుకుతుందని నేననుకోవటం లేదన్నాడట సదరు అధికారి.. ఎందుకు అలా అనుకుంటున్నారంటే.. అలాంటి పత్రిక ఒకటి ఇక్కడ ఉండాలని మేము భావించటం లేదు కాబట్టి అని జవాబిచ్చాడట. నైజాం రాజ్యంలో  ఒక పత్రిక రావాలంటే అధికారుల ఇష్టాష్టాల మీద ఆధారపడి ఉండేవన్నది ఈ వార్త చెప్తుంది. నిజాం నవాబును ఎవరు ఆశ్రయిస్తే.. అందలం ఎక్కేవాళ్లకు ప్రోత్సాహం.. విమర్శించేవారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేదాకా వదిలిపెట్టకపోవటం.. ఇదీ ఆనాటి వాతావరణం. ది హైదరాబాద్ రికార్డ్(1890), దెక్కన్ టైమ్స్(1891), దెక్కన్ స్టాండర్డ్(1891), దెక్కన్ పంచ్ (1890లో వచ్చిన ఉర్దూ వార్తాపత్రిక)లు 19వ శతాబ్ది చివరలో హైదరాబాద్ నుంచి వచ్చిన పత్రికలు.  
పంధొమ్మిదో శతాబ్దపు తొలి దశకం వరకు హైదరాబాద్ రాజ్యంలో ఒక్క తెలుగుపత్రిక వెలువడిన దాఖలా లేదు.. కానీ, తొలి పత్రిక మాత్రం శేద్యచంద్రిక 1880లలోనే పాలమూరు నుంచి వెలువడింది. కానీ దాని దాఖలాయే దొరకలేదు.. ఉర్దూ మాతృభాష కాకపోయినా... మాట్లాడే వాళ్లు నూటికి ఇరవై మంది కూడా లేకపోయినా, హైదరాబాద్ సంస్థానంలో సుమారు ఇరవై దాకా ఉర్దూ పత్రికలు చెలామణిలో ఉండేవి.
ఈ మాట అనగానే, తెలంగాణా ప్రాంతంలో అసలు తెలుగే లేదని.. ఉర్దూ తప్ప ఇక్కడి ప్రజలకు తెలుగు రాదనే దుర్మార్గమైన ప్రచారం ఒకటి దుర్నీతితో జరుగుతూ వస్తోంది. దిక్కులేక తెలుగు చెప్పే మాష్టార్లను అరువు తెచ్చుకుని పాఠాలు చెప్పించుకున్నారనే నీతిబాహ్యమైన ప్రచారం జరుగుతోంది. తెలుగుకు అధికార ప్రోత్సాహం లేదు కానీ, ఆదరణ లేక కాదు. తెలంగాణేతర ప్రాంతంలో తెలుగు అధికార ప్రాపకంతో సంకరమైతే.. అచ్చతెనుగును తెలంగాణాలో ఇక్కడి ప్రజలు కాపాడుకున్నారు. ఇక్కడి ప్రతిభ ఎన్నడూ ప్రచారాన్ని కోరుకోలేదు.. ఇక్కడి క్రియాశీలత ఎప్పుడూ ఆడంబరాలను కోరుకోలేదు. ఇక్కడ వెలువడిన సృజన యావత్తూ పట్టెడు మెతుకులతో ప్రశాంతతను కోరుకున్నదే తప్ప కూటనీతితో ఒక జాతి అస్తిత్వాన్ని కూకటి వేళ్లతో కూలదోయాలని కోరుకోలేదు.. కుట్ర చేయలేదు.  దినపత్రికా, మాసపత్రికా అన్న తేడా లేదు. తెలంగాణాలో పత్రికలు ఎన్ని రూపాల్లో రావాల్లో అన్ని రూపాల్లోనూ వచ్చాయి. అన్ని రకాల ప్రయోగాలూ చేశాయి.. తరతమ భేదం లేకుండా, తెలంగాణా, తెలంగాణేతర ప్రాంతాల్లో అనన్యసామాన్యమైన గరిమ గలిగిన వాళ్లనెందరినో ఇక్కడ వెలసిన పత్రికలు తమ భుజాలమీద మోశాయి. అందరినీ ఒక్కటిగా, తెలుగువారిగా భావించి, తమ ప్రజానీకానికి వారి శేముషీప్రతిభను విస్తారంగా అందించాయి.
తెలంగాణాలో ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశకంలో మహబూబునగరానికి చెందిన శ్రీనివాసశర్మ, రామచంద్రరావు సోదరులు మొట్టమొదట ముద్రణాయంత్రాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు ఆత్మకూరు సంస్థానాధీశుడు మూడువేల రూపాయలు పెట్టుబడి పెడితే, ఆ మాత్రం యంత్రం కొనుగోలు సాధ్యమయింది. దాంతో 1912లో హితబోధిని మాసపత్రిక మొట్టమొదటి తెలంగాణా పత్రికగా వెలువడింది. 1917లో స్వామి వెంకట్రావు అనే సంపాదకుడు హైదరాబాద్ లోని గౌలిగూడ నుంచి ఆంధ్రమాత అనే పత్రిక నడిపారు కానీ, అది ఎక్కువ కాలం కొనసాగలేదు. 1920దశకం తెలంగాణ పత్రికా రంగానికి మైలురాయి. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టి.. ఇక్కడి జనజీవనాన్ని, ఉద్యమాల్ని, సమస్యల్ని, సామాజిక నేపథ్యాన్ని అచ్చంగా ప్రతిబింబించిన పత్రికలు ఈ దశకంలోనే వెలువడ్డాయి. ఎందుకంటే నిజాం సంస్థానంలోని పరిస్థితులు, ఇక్కడి ఉద్యమాల పట్ల, సమస్యల పట్ల, ఆందోళనల పట్ల కోస్తాంధ్ర పత్రికలు నామమాత్రంగానే స్పందించాయి. అప్పటికే నిజాం సంస్థానంలోని తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల తెలంగాణేతర ప్రాంతానికి సరైన దృక్పథం లేదు.. అందువల్లే కావచ్చు తెలంగాణ ప్రాంతంలోని వార్తల పట్ల, ఇక్కడి ప్రజా సమస్యల పట్ల మొదటి నుంచీ అండదండలు అవసరమైన స్థాయిలో లభించలేదు.
ఇందుకు ఒకే ఒక్క ఉదాహరణ చెప్పవచ్చు. ఆంధ్రమహాసభ మితవాదుల చివరి సమావేశాలు మెదక్ జిల్లా కందిలో జరిగాయి. జమలాపురం కేశవరావు ఈ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ఆయన ప్రసంగాన్ని ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభలు ప్రముఖంగా ప్రచురించాయి. ‘‘నిజాం రాష్ర్ఠ ఆంధ్ర మహాసభ అధ్యక్షుల ప్రసంగం కోస్తాంధ్ర నుంచి వెలువడే పత్రికల్లోనూ వెలుగు చూడటం అదే తొలిసారి’’ అని కోదాటి నారాయణ రావు రాశారు. మద్రాసు పత్రికల వ్యవహార శైలి తెలంగాణా పట్ల ఎలా ఉండేదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. వాళ్ల వైఖరి తెలుసు కాబట్టే కంది సభలపై తామే ఒక సంచికను ప్రచురించామని కోదాటి నారాయణ రావు తన ఆత్మకథల్లో రాసుకున్నారు... నిజాం కాలంలో ఎలాగూ ఆదరణ లేదు.. ఇవాళ తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనదని, తెలుగుజాతిని ఉద్ధరణను నెత్తికెత్తుకున్నవారికి అసలే లేదు.. స్వాతంత్రసమరయోధుడు మాడపాటి హనుమంతరావు మాటల్లో చెప్పాలంటే...
‘‘ ఆ కాలమున బ్రిటిషు ఆంధ్ర ప్రాంతము నుండి వెలువడుచుండిన తెలుగు పత్రికలు ఇచ్చటి ఆంధ్రోద్యమ వార్తలనప్పుడప్పుడు ప్రకటించుచుండెను. అయినను వాని వలన తగినంత అవసరమున నుండినంత సహాయము లభించలేదు. అది సహజమే. అవి దూరస్థలములుగా నుండుట యొక కారణము. బ్రిటిషిండియాలోని ఉద్యమముల బాహుళ్యము వలన ఇచ్చటి ఉద్యమముల ఎక్కువగా ప్రోత్సహించునవకాశము వారికి లేకయుండెను. ఆ కారణంము వలన నిజాం రాష్ట్రంలోని ఆంధ్రోద్యమము ఇచ్చటి తెనుగు పత్రికల యాశ్రయమునే నమ్ముకుని వానిపైననే ఆధారపడవలసినదయ్యెను. ఇట్టి స్థితిలో  మన రాష్ర్టములోని పత్రికలు చేసిన సేవ ఎంత యమూల్యముగా నుండెనో వేరుగా చెప్పవలసిన పని యుండదు. ’’
నిజమే.. నిజాం సంస్థానంలో పత్రికా స్వాతంత్య్రం నామమాత్రమే. తెలుగు పత్రిక స్థాపించాలనుకున్నా, స్థాపించుకున్న పత్రికలో ఏదైనా రాయాలనుకున్నా.. నిజాం మంత్రిమండలి అనుమతిని తప్పనిసరిగా తీసుకోవలసిన పరిస్థితి... సర్కారుకు పూర్తిగా అనుకూలంగా ఉన్న పత్రికలను నిజాం సహజంగానే అక్కున చేర్చుకునేవాడు. కానీ, వాటి సంఖ్య వేళ్లపైన లెక్కపెట్టదగినవే. తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ మిత, అతివాద పంథాల్లో ప్రజల్లో జాతీయ వాద చైతన్యాన్ని మేల్కొల్పడంలో కృషి చేశాయి.
మాడపాటి హనుమంతరావు ముషీర్ ఏ దక్కన్ అనే పత్రికను నడిపించారు.. ఇది మితవాద పత్రిక.. కానీ, చరిత్రకారుడిగా నిలిచిన షోయబుల్లాఖాన్ నడిపించిన ఇమ్రోజ్ తన తరాన్ని మించిన స్వరాన్ని బలంగా వినిపించింది. అతివాదంతో రెచ్చిపోతున్న మత ఉన్మాదాన్ని నిర్ద్వంద్వంగా నిరసించింది.. ఇమ్రోజ్‌లో షోయబుల్లా ఉక్కుమాటలు.. ఖాసిం రజ్వీ రజాకార్ల మూకకు నిద్రలేకుండా చేసాయి. చివరకు షోయబ్‌ను హతమార్చేంత వరకూ రజాకార్లకు తిండి సయించలేదు..

హితబోధిని
తెలంగాణా నుంచి అన్ని లక్షణాలతో వెలువడిన పత్రిక హితబోధిని. 1913 జూన్ 13న మహబూబ్‌నగర్ నుంచి మొదటి సంచిక వెలువడింది. ఆనాటి దీని చిరునామా ఏమిటో తెలుసా? ‘సరోజినీ విలాస్ ప్రెస్ మహబూబ్ నగర్ నైజాం’ హైదరాబాద్ సంస్థానానికి నిజాంపేరుతో వచ్చిన ఫేమ్ నైజాం.. ఇవాళ్టికీ సినిమాలను ప్రాంతాల వారిగా పంపిణీ చేసేప్పుడు తెలంగాణా ప్రాంతాన్ని నైజాం అనే పిలుస్తారు. హైదరాబాద్‌కు పర్యాయపదంగా నైజాం అనేది వాడుకలో వచ్చింది.
హితబోధిని పత్రిక పెట్టుకోవటానికి దాని వ్యవస్థాపకులు బి.శ్రీనివాస శర్మ, బి.రామచంద్రరావు కనాకష్టం పడాల్సి వచ్చింది. వనపర్తి, ఆత్మకూరు సంస్థానాలకు విజ్ఞప్తి చేస్తే.. చివరకు ఆత్మకూరు సంస్థానాధీశుడు శ్రీరామ భూపాల బహిరీ బలవంత్ బహద్దూర్ ముద్రణా యంత్రానికి ఆర్థిక సాయం చేశారు.
ఇవాళ్టి పత్రికల్లో అనుబంధంగా వస్తున్న పుల్ అవుట్‌లను హితబోధిని ఆనాడే ప్రయోగాత్మకంగా ప్రచురించింది. పుల్ అవుట్ మాదిరి కాకపోయినా, పత్రికలో నాలుగు విభాగాలను ప్రత్యేకంగా ప్రచురించారు. 1. వ్యవసాయం, 2. వైద్యం, 3. పరిశ్రామికము, 4. సంఘ సంస్కరణము.
సంవత్సరం పూర్తయిన తరువాత 12 సంచికల్లోంచి ఏ విభాగానికి ఆ విభాగాన్ని విడదీసి కలిపి కుట్టుకుంటే ఎప్పటికీ ఉపయోగపడే పుస్తకాలుగా తయారయ్యే విధంగా వీటిని ప్రచురించేవారు. ఇటీవలి కాలంలో హిందూ దినపత్రిక ఇదే పనిని చేసింది. తన పుల్‌అవుట్‌లలో వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాలతో పుస్తకాలు ప్రచురించి మార్కెట్‌లోకి విడుదల చేసింది. దురదృష్టం ఏమంటే ఏడాది గడవకుండానే ఈ పత్రిక ఆర్థిక కష్టాల్లో కూరుకుని పోయి అంతర్థానం అయింది.
హితబోధిని తరువాత మనకు అందుబాటులోకి వచ్చిన పత్రిక నీలగిరి. 1921 నవంబర్ 12.. తెలుగు పంచాంగం ప్రకారమే చెప్పాలంటే, దుర్మతి నామసంవత్సరం, కార్తీక శుద్ధ ద్వాదశి రాత్రి హైదరాబాద్‌లోని ట్రూప్ బజార్‌లో హైకోర్టు వకీలు టేకుమాల రంగారావు నివాసంలో  11 మంది తెలుగు పెద్దలు సమావేశం అయి ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. దీన్నుంచే ఆంధ్ర జన సంఘం ఏర్పాటయింది. దీని లక్ష్యాలలో ఒకటి పత్రిక ద్వారా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవటం.. ఈ టార్గెట్‌ను సాధించే దిశగా షబ్నవీసు వెంకట రామ నరసింహరావు నల్లగొంట నుంచి 1922 ఆగస్టు 24వ తేదీన నల్లగొండ పట్టణం నుంచి నీలగిరి పత్రికను ప్రారంభించారు. నల్లగొండకు సంస్కృత రూపం నీలగిరి. అందుకే ఆ పేరుతో పత్రిక వెలువడింది.  బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి లాంటి వాళ్లు ఈ పత్రికలో వ్యాసాలు రాసేవారు. పత్రిక పెట్టిన ఏడాది తరువాత జరిగిన ఆంధ్రమహాసభ సమావేశాలు నల్లగొండలోని నీలగిరి పత్రిక కార్యాలయంలోనే జరిగాయి. ఆంధ్రోద్యమానికి మద్దతునిస్తూ ఈ పత్రికలో వ్యాసాలు వచ్చేవి. దాదాపు అయిదు సంవత్సరాల పాటు నీలగిరి పత్రిక కొనసాగింది. అంతో ఇంతో డబ్బున్నవాడు కాబట్టి ఆయన పత్రిక ప్రారంభించగలిగాడు. కానీ, అదే పత్రిక ఆయన ఆర్థిక స్థోమతను అంతా దిగమింగేసింది. చివరకు పత్రికను మూసివేసిన కొన్నాళ్లకే షబ్నవీసు మరణించారు.. అప్పటికి ఆయన వయస్సు కేవలం 34 సంవత్సరాలంటే నమ్మబుద్ధి కాదు. కోస్తాంధ్ర నుంచి వలస వచ్చిన దూపాటి వెంకటరమణాచార్యులను షబ్నవీసు కొంతవరకు ఆదుకున్నారు. ఆయన జీవించి ఉంటే మరో సురవరం అయ్యేవారనటంలో సందేహం లేదు.
నీలగిరి పత్రిక వెలువడిన సరిగ్గా మూడే మూడు రోజుల తరువాత అంటే 1922 ఆగస్టు 27న వరంగల్లు జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి అనే ఓ చిన్న గ్రామం నుంచి తెనుగు అనే పత్రిక వెలువడింది. తెలంగాణా వారి ప్రతిభకు, వాళ్ల శేముషీ సంపన్నతకు తెనుగు పత్రిక వ్యవస్థాపకులు మణికిరీటాలు. ఈ పత్రికను స్థాపించి,నడిపించిన వాళ్లు ఒద్దిరాజు సోదరులు. ఈ సోదరులు ఇద్దరిలో ఒకాయన ఒద్దిరాజు సీతారామచంద్ర రావు.  ఈయన హోమియో పతి వైద్యులు. తెనుగు పత్రికకు ఈయనే సంపాదకుడు. ఈయన తమ్ముడు ఒద్దిరాజు రాఘవ రంగారావు సహాయ సంపాదకుడు.  నీలగిరితో పాటు, తెనుగు పత్రిక సైతం దాదాపు అయిదు సంవత్సరాల పాటు నిజాం రాష్ట్రంలో ప్రతిభావంతులైన సంపాదకులతో నడిచింది. ఇద్దరు సోదరులు.. పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగు, సంస్కృత భాషలలో రచనలు చేయగల సమర్థులు...
వీరిద్దరూ ఇనుగుర్తిలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.. ఆ రోజుల్లో తెలంగాణాలో ప్రింటింగ్ ప్రెస్‌లు వేళ్లపైన లెక్కించేంతగా ఉండేవి. ప్రింటింగ్ ప్రెస్ సామాగ్రేమో మద్రాసులో దొరికేది.. ఇందుకోసం అన్నదమ్ములిద్దరూ మద్రాసు వెళ్లి అక్కడ ఉప్పల వీరన్న శ్రేష్టి అన్న వ్యాపారి దగ్గరి నుంచి సామాగ్రి తెచ్చుకునే వారు..
మద్రాసులో దొరికే కొత్త వస్తువులేవైనా సరే.. రోజుల వ్యవధిలోనే ఇనుగుర్తికి వచ్చేవి. గ్రామ్‌ఫోన్‌లు, సైకిలు, థర్మాస్ ఫ్లాస్క్.. ఇలా ప్రతి వస్తువూ కొత్తగా మార్కెట్‌లోకి వస్తే చాలు.. ఇనుగుర్తిలో ప్రత్యక్షమయ్యేవి.. వరంగల్లు జిల్లాకు కొత్తవస్తువులను చాలా వరకు పరిచయం చేసింది ఒద్దిరాజు సోదరులే. శుభకార్యాల ఆహ్వాన పత్రికలను వాళ్ల ప్రెస్‌లోనే ప్రచురించేవారు.ఈ సోదరులు పత్రికనే కాదు.. ఎస్. రాయ్ ఫార్మసీ అనే మందుల కంపెనీని కూడా స్థాపించారు. మధుర, పిత్త అనే మందులను వీళ్లే తయారు చేసేవారు. మొదటిది మలబద్దకానికి, రెండోది జ్వర నివారణకు బాగా పనికి వచ్చేది. మానుకోటలో మొట్టమొదట ఆయిల్ ఇంజన్ తెచ్చి బిగించిన వాళ్లు ఒద్దిరాజువారే.
వీళ్లు వైదిక సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేసిన వాళ్లే.. షేక్‌స్పియర్ సాహిత్యం అంటే చెవి కోసుకునే వారు. గమ్మత్తేమిటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములూ వయోలిన్‌కు అద్భుతంగా వాయించేవారు. తమ్ముడు రంగారావు వీణావాదనలోనూ ప్రతిభావంతుడే.. అంతే కాదు.. ఇద్దరికీ ఫోటోగ్రఫీ బాగాతెలుసు.. ఈ పేరుతో వీళ్లు ఓ పుస్తకాన్నే రాశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారి ప్రతిభకు అంతే ఉండదు.. వాళ్లకు చేతివృత్తుల్లో కూడా మాంఛి నైపుణ్యం ఉంది. వాళ్లకు వడ్రంగం తెలుసు. తాపీపని.. అంటే ఇల్లు నిర్మించే పని కూడా తెలుసు.. చెప్పులు కుట్టుకోవటం కూడా తెలుసు. ఇనుగుర్తిలో తమ ఇంటి ముఖద్వారపు నగిషీ పనిని వారే చేసుకున్నారు. వాళ్ల ఇంటిని వాళ్లే కట్టుకున్నారట.. ఎంత గట్టిగా కట్టుకున్నారంటే, కమ్యూనిస్టుల పోరాట కాలంలో దుండగులు గునపాలతో ఎంత ప్రయత్నించినా గోడ పెచ్చులు ఊడలేదట. దానితో విసుగు చెంది, ఒద్దిరాజు సోదరులు జీవితమంతా కష్టపడి సేకరించిన పుస్తకాలను తగులబెట్టి వెళ్లారట.
తెనుగు పత్రిక సగం డెమీ సైజలో, అంటే దినపత్రిక పరిమాణంలో సగం ఉండేది. ఇది వారపత్రిక. ప్రతి ఆదివారం వచ్చేది. వివిధ విషయాలపై సంపాదకీయాలు ఒకపేజీలో రాసేవారు.. స్థానిక వార్తలకు ఆనాడే పెద్దపీట వేసిన పత్రిక తెనుగు.. మోస్ట్ లోకలైజ్‌డ్ న్యూస్‌పేపర్ తెనుగు. మరో ఆరునెలల్లో మూతపడుతుందనగా తెనుగు పత్రిక వరంగల్‌కు మారింది. కానీ, మనుగడ సాగించలేకపోయింది. స్థానిక వార్తలకు ఇవాళ అన్ని పత్రికలూ ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెనుగు ఆనాడే చేసి చూపింది.

1925లో హనుమకొండ నుంచి ఆంధ్రాభ్యుదయము తొలి సంచిక వెలువడింది. మార్చి నెలలో వచ్చిన ఈ సంచిక ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. పత్రికను ఆరంభించటానికి 1922లో ప్రభుత్వం అనుమతి కోరితే అది రావటానికి  ఏడాదిన్నర పట్టింది. ఈ సంచికలు నాలుగు రావటమే గగనమైపోయింది. నిజానికి ఈ పత్రికను 1919లోనే తీసుకురావాలని అనుకున్నారు. కానీ, 1923 నాటికి కానీ ఇది సాధ్యం కాలేదు. 1928 వరకు నాలుగు సంచికలు మినహా మిగతావి తీసుకురాలేదు. కోకల సీతారామ శర్మ ఈ పత్రికకు సంపాదకత్వం వహించారు.. తెలంగాణ ప్రాంతంలో గ్రాంధిక భాషావాదాన్ని సమర్థించిన పత్రిక ఆంధ్రాభ్యుదయము. గుర్రం జాషువా, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఉమర్ అలీషా, సముద్రాల రాఘవాచార్యుల రచనలు ఈ సంచికల్లో మనకు కనిపిస్తాయి.

రంగారెడ్డి జిల్లా మేడ్చెల్ దగ్గరలో మఖ్తేవడ్డేపల్లి అనే గ్రామం ఉంది. ఇప్పుడంటే రంగారెడ్డి జిల్లా కానీ, ఇది ఒకప్పుడు హైదరాబాద్ జిల్లానే.. ఇక్కడ బెల్లముకొండ నరసింహాచార్యులు అనే దేశభక్తుడొకాయన దేశబంధు అనే పత్రికను వెలువరించే సాహసం చేశారు. 1926 జూలైలో తూపురాన్ పోస్టు పరిధిలో ఉన్న ఈ మఖ్తేవడ్డేపల్లి నుంచి ఈ పత్రిక వచ్చింది. మూలధనంతో కాకుండా మూల రుణంతో పత్రికను ఆయన ప్రారంభించారు. ఏదైనా మంచిపని చేద్దామని అనుకుంటే ఎవరూ సహకరించలేదని ఆయన తన తొలి సంపాదకీయంలో పేర్కొన్నారు. దేశబంధు టైటిల్ కింద ఆంధ్ర విజ్ఞాన ప్రబోధక మాస పత్రిక అని టాగ్ లైన్ కూడా రాసుకున్నారు.
పత్రికకు వ్యాసాలు పంపే విషయంలో రచయితలు పాటించాల్సిన నియమాల గురించి సూచనలు చేసిన తెలంగాణా పత్రిక దేశబంధు. ‘‘ మా పత్రికకు పంపబడే వ్యాసములు సజ్జన సమ్మతముగా, దేశ హితముగా నుండవలెను. పరస్పరాంతః కలహాస్పదములగు మతముల విషయములు ఇందులో చేర్చబడవు. పత్రికల యందితరులు వ్రాయు వ్యాసములకు సంపాదకుడుత్తరవాది కాదు’’. ప్రింటింగ్ ప్రెస్ కోసం సంపాదకుడు విరాళాలు సేకరించి మరీ నడిపించారు.

తెలంగాణ ఉద్యమ శిఖరం గోలకొండ

తెలంగాణకు ఇవాళ మనం సమైక్యమని భావిస్తున్న తెలుగునేల నాలుగు చెరగలా తనదైన అస్తిత్వాన్ని నిలిపి చూపించిన పత్రిక గోలకొండ. తెలంగాణాలో సుదీర్ఘకాలం కొనసాగిన అచ్చమైన తెలుగు పత్రిక. మంచి అడ్వకేట్‌గా పేరు సంపాదించుకున్న సురవరం ప్రతాపరెడ్డి గారి మనసు పత్రికారంగంవైపు మళ్లింది.. దాని పర్యవసానంగా 1926 మే పదవ తేదీన.. అంటే ఉర్దూ కేలెండర్ ప్రకారం తీర్ నెల మూడో తేదీ.. గోలకొండ పత్రిక తొలి సంచిక అచ్చయింది. దీని తొలి పెట్టుబడి 7వేల రూపాయలు. మొదట అడ్డంకులు ఎన్నో ఎదురుకావచ్చు. కానీ, పత్రిక ప్రారంభించిన సంకల్పం గొప్పది.. అందుకే గోలకొండ పత్రిక పాతిక సంవత్సరాల పాటు తన కలం నుంచి అక్షర తూణీరాలను అప్రతిహతంగా వదులుతూనే ఉంది.
నిజంగా నిజాం కాలం నాటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే గోలకొండ పత్రిక  అన్నేళ్ల పాటు ఎలా కొనసాగిందా అన్న ఆశ్చర్యం వేస్తుంది. కానీ, సురవరం వారు ఆనాటి స్థితిగతులను వాస్తవిక దృష్టితో  చూసి తెలంగాణా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక చిత్రాన్ని గోలకొండ పత్రిక ద్వారా ప్రపంచానికి చూపించారు.
‘‘ ఈ పత్రిక ఆంధ్రులకు (వారు బయటి వారు కానీ, రాష్ట్రీయులు కానీ) అసాధారణమగు సంబంధం కలది. సర్వకాలాలందు కానీ, అనుకూలం కానట్టి వాతావరణంలోనూ క్లిష్ట పరిస్థితులలోనూ ఈ పత్రిక నడపబడుతున్నది. అట్లున్నను మా పత్రికలలో అత్యగ్రస్థానం వహించిన మూడు నాలిగింటిలో దీనినొకదానినిగా చేసిన నిజాం రాష్ట్రాంధ్రుల సేవ ప్రశంసనీయం. సురవరం ప్రతాపరెడ్డిగారు వారి సహచరులును పత్రికను సజీవముగా నుంచుటయే గాక ఉత్తమమైన స్థాయిలో దీనిని బాగుగా నడుపుతూ తద్వారా ఆంధ్రుల శక్తి సామర్థ్యాలకు ప్రోద్బలం కలిగించినందులకు అన్ని విధాలా ఆంధ్రుల యొక్క గాఢమగు కృతజ్ఞతకు పాత్రులగుచున్నారు. ’’ కోదాటి నారాయణరావు స్వీయ చరిత్ర నారాయణీయంలో  వివరించారు. తెలంగాణాలో పత్రికారచనను అలవరచుకున్న వాళ్లు చాలా తక్కువగా ఉన్నారని, అందువల్ల ఆ రంగాన్ని ఎంచుకుంటే అభివృద్ధిలోకి వస్తావంటూ కోదాటి వారిని మాడపాటి వారు ప్రోత్సహించారట. ఆయన ప్రోత్సాహంతోనే కోదాటి వారు గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా చేరి తన పాత్రికేయ వృత్తిని ప్రారంభించారు.
గోలకొండ మొదట అర్థవార పత్రిక.. ఆ తరువాత దినపత్రికగా మారింది. ఇది ఆనాడు ఆర్థిక స్థోమత లేక సరిగా రాలేకపోయింది. పత్రికను ఎలాగైనా బతికించేందుకు ఒకే పత్రికను, రేపటి పత్రిక, నిన్నటి పత్రిక, ఇవాళ్టి పత్రిక అని అమ్మే వారట.. జనం కూడా కొనటానికి వెనుకాడలేదు. పత్రిక క్రమం తప్పకుండా రావటం మొదలు పెట్టిన తరువాత ఈ ఆరోపణలు తగ్గిపోయాయి. వేతనాలు తక్కువగా ఉన్నాయని కంపోజిటర్లు ఆందోళన చేస్తే, తమ వద్ద తొందరగా పని పూర్తి చేసుకుని వేరే పత్రికలో పనిచేసే అవకాశాన్ని సురవరం వారు వారికి కల్పించారు.
‘‘గోలకొండ సంపాదకీయాలు అద్భుతం నిజాం ప్రభుత్వానికి అది గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు, మహా సంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ’’ అని దాశరథి తన యాత్రాస్మృతిలో రాశారు. నాటి తెలంగాణాను మనం కళ్లకు కట్టినట్లు చూడాలంటే గోలకొండ పత్రికను చూస్తే చాలు.
ఒక పత్రిక వ్యక్తి స్థాయి నుంచి వ్యవస్థకు ఎదిగింది గోలకొండ తోనే. గోలకొండ నిర్వహణకు ఒక లిమిటెడ్ కంపెనీ ఏర్పడింది. డైరెక్టర్ల బోర్డుకు రాజా రామేశ్వరరావు అధ్యక్షులైతే, మేనేజింగ్ డైరెక్టర్‌గా నూకల నరోత్తమరెడ్డి వ్యవహరించేవారు. తెలంగాణా పత్రికా ప్రస్థానంలో ఒక పత్రిక ఇండస్ట్రీగా ఎదగటం అదే తొలిసారి. ప్రతాపరెడ్డినీ, గోలకొండ పత్రికనూ విడదీసి చూడటం సాధ్యం కాదు. అనారోగ్యం కారణంగా ఆయన నిష్ర్కమణ తరువాత గోలకొండ బలహీనమవుతూ వచ్చింది. 1966 ఆగస్టు 22న గోలకొండ పత్రిక మూతబడింది. గోలకొండ నుంచి బయటకు వచ్చిన తరువాత సురవరం ప్రతాపరెడ్డి ప్రజావాణి పత్రికను ప్రచురించేందుకు ప్రయత్నించారు కానీ, అది నడవలేదు..

సికిందరాబాద్ నుంచి 1942 ప్రాంతంలో వెలువడిన మాసపత్రిక తరణి. జ్యోతిష్య శాస్త్రం వంటి ప్రాచీన శాస్త్ర విషయాలతో పాటు ఆధునిక సాహిత్య విషయాల వరకు వైవిధ్యం కలిగిన రచనలతో కొద్ది కాలం మాత్రమే వచ్చిన పత్రిక ఇది. సుబ్బరాయ సిద్ధాంతి అనే ఆయన దీనికి సంపాదకుడు. దేవులపల్లి రామానుజరావు శోభ 1947లో ప్రారంభించి కొంతకాలం నడిపి చేతులు కాల్చుకున్నారు. ఇది మాసపత్రికగా తెలంగాణా సాహిత్య శోభలను వెదజల్లింది. ఇదే వరంగల్ జిల్లా జనగామ తాలూకా గూడూరు గ్రామంలో బొబ్బాల ఇంద్రసేనారెడ్డి (ఈయన నటుడు, దర్శకుడు కూడా)గ్రామజ్యోతి పేరుతో గోడ పత్రికను నడిపించాడు. వారానికోసారి గోడపై వార్తలు రాసేవారు.. వారం తరువాత వాటిని చెరిపేసి కొత్త వార్తలు రాసేవారు. ప్రభుత్వం ఈ గోడ పత్రికపై వార్తలను కూడా సెన్సార్ చేసేది. వరంగల్ పత్రికా రంగంలో ప్రభుత్వానికి 50 రూపాయలు జరిమానా కట్టిన మొదటి పత్రిక ఈ గోడ పత్రికే.


తొలి దినపత్రిక తెలంగాణ
తెలంగాణ ప్రాంతం నుంచి వెలువడిన తొలి తెలుగు దినపత్రిక తెలంగాణ. 1941-42 ప్రాంతంలో బుక్కపట్నం రామానుజాచార్యులు ఈ పత్రిక ప్రారంభించారు. బికె చారిగా ప్రసిద్ధి చెందిన ఈయన 1929లోనే హైదరాబాద్ బులెటిన్‌ను స్థాపించిన అనుభవం ఉంది. అంతే కాదు, తన మిత్రుడు కె. రాజగోపాల్‌తో కలిసి 1937లో దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికను ప్రారంభించారు. దక్కన్ క్రానికల్‌లో బుక్కపట్నం వారు చార్మినార్ గాసిప్ అని కాలమ్ రోజూ నడిచేది. బడాబడా నవాబు అంతఃపురాలలోని విషయాలు, పై అధికార వర్గం కార్యాలయాల రహస్యాలు ఇందులో వచ్చేవి. ఇందులో ఉన్నప్పుడే తెలంగాణ దినపత్రిక ప్రారంభమైంది కానీ, ఎక్కువ కాలం కొనసాగలేదు. గోలకొండ పత్రిక దినపత్రిక అయినప్పటికీ అది వారపత్రికగా కొంతకాలం రావటం వల్ల తొలి దినపత్రికగా తెలంగాణాను పేర్కొనవచ్చు. ఆరోజుల్లో తెలంగాణలో దక్కన్‌క్రానికల్ ఆంగ్ల దినపత్రిక అయితే, గోలకొండ తెలుగు దినపత్రిక అనేవారు. ఉర్దూలో మీజాన్ ఉండేది. వీటి మధ్యలో తెలంగాణా వచ్చింది. నాంపల్లి స్టేషన్ రోడ్డు నుంచి వెలువడ్డ ఈ పత్రిక సంవత్సర చందా ఎంతో తెలుసా? 22 రూపాయలు.

ఆంధ్ర సారస్వత మహా సభ ప్రచురించిన పత్రిక ఆంధ్రశ్రీ. ఇది సికిందరాబాద్ నుంచి 1944లో త్రైమాసిక పత్రికగా మొదలైంది. అంతకు ముందు 1941లో సికింద్రాబాద్ నుంచే తెలుగుతల్లి పత్రిక వెలువడింది. రాచమళ్ల సత్యవతీదేవి ఈ పత్రిక సంపాదకులు. అడవిబాపిరాజు, వెల్దుర్తి మాణిక్యరావు, వట్టికోట ఆళ్వారుస్వామి సహాయ సంపాదకులు. కింగ్స్‌వే లోని ఇమాంబావి వీధిలో ఈ పత్రిక కార్యాలయం ఉండేది. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం నిర్వహణలో ఈ పత్రిక ప్రచురణ జరిగింది. 1949జూన్‌లో హైదరాబాద్ నుంచి ఓ పక్ష పత్రిక కొంతకాలం నడిచింది. దీనిపేరు భాగ్యనగర్. అయోధ్య రామకవి దీనికి సంపాదకుడు. సహాయ సంపాదకుడుగా యం రాజేశ్వరరావు పేరు పత్రికలో కనిపిస్తుంది. ఇది సుల్తాన్ బజార్ ప్రాంతంనుంచి వెలువడేది. పోలీసు చర్య తరువాత రాజకీయ వాసనలు పుణికిపుచ్చుకుని వెలువడిన పత్రిక భాగ్యనగర్. ఈ పత్రిక పాత ప్రతులు హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయంలో కనిపిస్తాయి. మొత్తం ఆరు సంచికలు వెలువడిన తరువాత ఇది ఆగిపోయింది. 1940 అక్టోబర్‌లో హైదరాబాద్ సాహిత్య పరిషత్ ఏర్పడింది. ఇది 1945లో హైదరాబాద్ ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రికను ప్రారంభించినా ఆదిలోనే ఆగిపోయింది. అయితే 1955లో విద్యార్థుల వాణిని మాత్రమే వినిపించేందుకు హైదరాబాద్ నుంచి కె.ఎం నరసింహరావు విద్యార్థి వాణి పత్రికను తీసుకువచ్చారు. విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనాలా? పాల్గొంటే ఎలాంటి పాత్ర పోషించాలి వంటి వ్యాసాలను ఇందులో ప్రచురించేవారు.

మీజాన్
తెలంగాణాలో ఏకకాలంలో మూడు భాషల్లో వెలువడిన మొదటి పత్రిక మీజాన్. కలకత్తాకు చెందిన గులాం మహమ్మద్ ఈ పత్రికను స్థాపించాడు. ఏడవ నిజాముకు ఇతను నమ్మిన బంటు.. నవాబుకు పూర్తి మద్దతునిచ్చే పత్రికను నడిపించే ఉద్దేశ్యంతోనే మీజాన్ మొదలైంది. అడవి బాపిరాజు ఈ పత్రిక తెలుగు విభాగానికి సంపాదకుడుగా ఉండేవారు.. బాపిరాజు గురించి నాటి తెలంగాణా సాహితీవేత్తల్లో, నాయకుల్లో ఎలాంటి అపోహలు లేవు. అయితే మీజాన్ పత్రిక నిజాం అనుకూల పాలసీ కావటం వల్లనే చిక్కులు వచ్చాయి. మీజాన్‌లో చేరిన తరువాత నిజాం పరిపాలనలోని నిప్పులాంటి నిజాలు తెలిసి వచ్చాయి. తాను కలకత్తావాలా కబంధ హస్తాల్లో ఇరుక్కున్నానని తెలుసుకున్నారు. పత్రిక ప్రారంభించిన 65 రోజులకే నవాబు వారి పుట్టినరోజు వేడుకలు వచ్చాయి. అందులో రెండు సంపాదకీయాలు వచ్చాయి. ఒకటి నిజాంకు అభినందనలు అన్న పేరుతో వస్తే.. రెండవది తప్పుడు ప్రచారం అన్న శీర్షికతో వచ్చింది. రెండో సంపాదకీయంలో అప్పటికే ఉర్దూలో ప్రసిద్ధి చెందిన రయ్యత్ పత్రిక సంపాదకుడు మందుముల నరసింగరావును దేశద్రోహిగా చిత్రిస్తూ రాశారు.. దీనిపై ప్రజాకవి కాళోజీనారాయణరావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘‘ 65 రోజుల ఉనికి ఉన్న పత్రిక మీది. మీరు హైదరాబాద్ వచ్చి కూడా 65 రోజులే అయింది. నిజాం వంశీయుల కంటే ముందే నిజాం సంస్థానంలో ఉన్న మందుముల వారిని గురించి దేశద్రోహి అని ఎట్లా రాస్తార’’ని బాపిరాజును నేరుగా నిలదీశారు. దానికి బాపిరాజు ‘‘కాళోజీ నారాయణరావు గారూ.. ఏం చేయమంటరండీ నన్ను, నెలకు నూట యాభై రూపాయల జీతమిస్తమన్నారు. దాంతోటి నాకు రెండు పూటల తిండి దొరుకుతున్నది. వాండ్ల ప్రెస్‌లనే నా నవల లేవన్న ఉంటే అచ్చు వేసుకోమన్నారు’’ అన్నారట. 1940వ దశకంలో చోటు చేసుకున్న సంఘటన ఇది. కాళోజీ తన అంతేవాసి నాగిళ్ల రామశాస్త్రితో వివరించిన  ఈ ఘటనను ఆయన ఆ తరువాత అక్షరబద్ధం చేశారు. ఈ పత్రికలో విద్వాన్ విశ్వం, తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, శ్రీనివాస చక్రవర్తి లాంటి వాళ్లు పని చేశారు.. ఆరోజుల్లో వీళ్లందరినీ కలిపి ద్వాదశ మార్తాండులని పిలిచేవారు. ఉగాది సందర్భంగా మీజాన్ పత్రిక తెలంగాణ ప్రముఖులకు బిరుదులు ప్రకటించేది.. ఇవి నవ్వుకునేట్లు ఉండేవి. కాకపోతే అంతా సరదాగా తీసుకునే వారు. అందులో మచ్చుకు ఒకటి.. దేవులపల్లి రామానుజరావుకు ఇచ్చిన బిరుదు. అది ‘‘ఏకశిలానగర శిలాఫలక కలకల శోభావిభావరి’’.
మీజాన్ క్రౌనుసైజు నాలుగు పేజీలుగా వచ్చింది. వార్తలకు తొలి, ఆఖరు పేజీలు. రెండో పేజీలో సంపాదకీయం, ధూపదీపాలు(బాపిరాజు రాసేవారు), నుడి నానుడి(తిరుమల రామచంద్ర రాసేవారు), నర్తనశాల(శ్రీనివాస చక్రవర్తి రాసేవారు.), కలంపోటు(బిసి కామరాజు రాసేవారు),  మిర్చిమసాలా (రాంభట్ల కృష్ణమూర్తి రాసేవారు), టైంబాంబులు (బొమ్మకంటి సుబ్బారావు రాసేవారు). మూడో పేజీలో బాపిరాజు నవల డైలీ సీరియల్ అచ్చయ్యేది. స్థూలంగా మీజాన్ పత్రిక కూర్పు ఇది.  దినపత్రికలో రోజూ నవలను ప్రచురించే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది మీజాన్.

1941లో హైదరాబాద్ రాష్ట్రం నుంచి ఆరుగురు ఉత్సాహవంతులైన యువకులు ప్రారంభించిన పత్రిక ఆంధ్రకేసరి. గుండవరపు హనుమంతరావు దీనికి సంపాదకుడు. 1941 ఫిబ్రవరిలో ఈ పత్రిక తొలి సంచిక వెలువడింది. ‘‘ నైజాము రాష్ట్రంలో 75లక్షల మంది ఆంధ్రులున్నారు. వారి ప్రత్యేక ఆర్థిక సాంఘిక సమస్యలకు తమకనుగుణ్యమగు పరిష్కరణా విధానములను ప్రజలకు తెలుపుటకై వార్తాపత్రికలు, సంచికలు వారికి స్వయముగానుండుట తప్పనిసరి’’ అన్నది ఈ పత్రిక లక్ష్యం. 1944లో మాసపత్రికగా ప్రారంభమైన పత్రిక కాకతీయ. పివి నరసింహరావు వరుసకు సోదరుడైన పాములపర్తి సదాశివరావు మరి కొందరు మిత్రులు కలిసి ఈ పత్రికను స్థాపించారు. అయితే ఇది ఏడాది పాటు కూడా నడవలేదు. కానీ, 1946లో ఇది సాంస్కృతిక, ప్రాంతీయ, రాజకీయ, సాహిత్య పత్రికగా తిరిగి ప్రారంభమై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగింది. దేశ ప్రధానమంత్రిగా కీర్తిగడించిన పివి నరసింహరావు ఈ పత్రికలో మూడు పేర్లతో వ్యాసాలు రాసేవారు. ఆయన హాస్యరచనలు కూడా చేశారు. దురదృష్టమేమిటంటే ఈ పత్రిక ప్రతులు ఇప్పుడు లభించవు.

రయ్యత్
వాక్స్వాతంత్య్రము లేదు.. బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛ అంతకంటే లేదు.. ఆందోళనలకు, ధర్నాలకు, సహాయ నిరాకరణానికి ఎలాంటి అవకాశము కూడా లేదు. ఇలాంటి వాతావరణంలో పత్రికల ద్వారా ప్రజల్లో కొంతైనా చైతన్యం తేవచ్చనే ఒకే ఒక ఉద్దేశంతో ఉర్దూలో రయ్యత్ పత్రిక మొదలైంది. తెలంగాణ పత్రికారంగంలో రాజధిక్కార స్వరాన్ని ప్రత్యక్షంగా, తీవ్రంగా వినిపించిన తొలి పత్రిక రయ్యత్. మందుముల నరసింగరావు దీని సంపాదకులు.. నిజాం ప్రభుత్వం దేశద్రోహిగా అభివర్ణించినా తాను నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా ముందుకు వెళ్లగలిగిన పాత్రికేయుడు మందుముల. తన పత్రిక ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అవసరమైన జాగృతిని కలిగించటంలో ఆయన విజయం సాధించారు. తెలంగాణాలో జరుగుతున్న నిజాం వ్యతిరేక యుద్ధాన్ని గురించి ఎక్కడో ఉన్న ఉత్తర భారతీయులకు సమాచారం అందిందంటే అది రయ్యత్ పత్రిక వల్లనే సాధ్యపడింది. ఆనాటి మితవాద యుగంలో దాని పరిమితులను దాటి అతివాద పోరాట పంథాను కలానికికెత్తుకున్న యోధా రయ్యత్ అని చెప్పటానికి సందేహం అక్కర్లేదు. ఆరోజుల్లో దేశ సమస్యలను గురించి ఆలోచించే ప్రతివారూ రయ్యత్ పత్రికను చదివేవాడు. ప్రభుత్వ విధానాలను విమర్శించటంలో ఎంతమాత్రం జంకకుండా ధైర్యంగా ప్రజల పక్షాన నిలిచిన గౌరవం రయ్యత్ పత్రికకే  దక్కుతుంది. నూరు రూపాయల పెట్టుబడితో 1927లో రయ్యత్ మొదలైంది. మొదటి సంచికకు సరోజినీ నాయుడు శుభాఃశీస్సులు అందించారు. రెండో సంచికలో మహరాజా కిషన్ పర్షాద్ కవితలు అచ్చయ్యాయి. 1929నిజాం ప్రభుత్వం రయ్యత్‌ను నిలిపివేసింది. తిరిగి 1932లో మళ్లీ మొదలైంది. పింగళి వెంకట రామరెడ్డి 500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. గోలకొండ పత్రికకు ఇది సమకాలీన పత్రికే. ఇది వారపత్రిక నుంచి దినపత్రిక స్థాయికి ఎదిగాక, గోలకొండ మాదిరిగానే, రయ్యత్ లిమిటెడ్ కంపెనీగా ఎదిగింది. ఇరవై సంవత్సరాల పాటు ఉద్యమ క్షేత్రంలో ఉరకలెత్తిన పత్రిక ప్రభుత్వం నిషేధించటంతో మూతపడాల్సి వచ్చింది.

షోయబుల్లాఖాన్

తెలంగాణా పాత్రికేయ రంగానికి ప్రాతఃస్మరణీయుడు, తెలంగాణా జర్నలిస్టులకు పూజనీయుడు షోయబుల్లాఖాన్. నిజాం సంస్థానంలో రజాకార్ల దురంతాలను నిర్భయంగా ఎండగట్టి.. పెన్ పవర్‌ను చూపించిన సాహసి. ముష్కర మూకల దొంగదెబ్బకు బలైపోయిన అమరుడు. ఈయన రాజకీయ ప్రస్థానం రయ్యత్ పత్రికతోనే మొదలైంది. మందుముల నరసింగరావు దగ్గర పని చేస్తున్న నలుగురు సహాయ సంపాదకులు రాజీనామా చేసి వెళ్లిపోవటంతో ఇద్దరు సంపాదకులను వెతుక్కోవలసి వచ్చింది. ఆ అన్వేషణలో దొరికిన ఆణిముత్యం షోయబుల్లాఖాన్. పాతికేళ్ల వయసులోనే వృత్తిలోకి వచ్చి వేడి నెత్తురు శక్తి ఏమిటో చూపించిన వాడు. షోయబ్ పూర్వికులు ఉత్తర ప్రదేశ్ వాళ్లు. తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాడు. తాను రాయిస్టుననీ, అయినా పత్రికా విధానాలను పాటిస్తానని షోయబ్ హామీ ఇచ్చాడు. 75 రూపాయలతో మొదలైన షోయబ్ జీతం వందరూపాయలకు చేరుకుంది. అయితే రయ్యత్ పత్రిక అనుసరిస్తున్న మితవాద ధోరణి ఆయనకు నచ్చలేదు. నిజాం విధానాలను నిర్ద్వంద్వంగా విమర్శిస్తున్నా.. మితవాదంతో వ్యవహరించటం ఆయనకు సరిపడలేదు. ఓ పక్క హైదరాబాద్ రాష్ర్టం తగులబడిపోతోంది. రజాకార్లు రెచ్చిపోతున్నారు.. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా మట్టుబెడుతున్నారు. ప్రజలంతా కొందరు గుల్బర్గా వైపు, మరి కొందరు నాగపూర్ వైపు.. ఇంకొందరు విజయవాడ వైపు వలసలు పోవలసిన పరిస్థితి. అయినా రయ్యత్ విమర్శల్లో అతివాదం లేకపోవటంతో షోయబ్ ఆ పత్రికను విడిచిపెట్టాడు. బయటకు వచ్చి ఇమ్రోజ్ పత్రికను ప్రారంభించాడు. ఇది దినపత్రిక. ఆయన పత్రికను స్థాపించేనాటికే నిజాం రాజు రజాకార్ల చేతిలో బందీ అయ్యాడు.. రజాకార్ల నేత ఖాసిం రజ్వీ ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో రజాకార్లకు వ్యతిరేకంగా మంజూర్ జంగ్, ముల్లా అబ్దుల్ బాసిత్, సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ జాఫరీ, బాఖరలీ మీర్జా, ఫరీద్ మీర్జా, హుసేన్ అబ్దుల్ ముసాదే అనే వాళ్లు ఓ పత్రికా ప్రకటన చేశారు. ఆ ప్రకటన యథాతథంగా ఇమ్రోజ్‌లో అచ్చయింది. దాని ఆధారంగా షోయబ్ సంపాదకీయాన్ని కూడా రాశాడు. ఇది రజాకార్లకు మింగుడు పడలేదు. 1948 ఆగస్టు 22న (ఇంకా అప్పటికి హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం రాలేదు.. పోలీసు యాక్షన్ మొదలు కాలేదు.. ఈ ఘటన జరిగిన 25 రోజుల తరువాత అంటే సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి లభించింది. ) నగరం నడిబొడ్డున కాచిగూడ ప్రాంతంలో రజాకార్లు షోయబుల్లాఖాన్‌ను దారుణంగా హత్య చేశారు. మొదట షోయబ్ రెండు చేతులు నరికారు. ఆ తరువాత శరీరమంతా కత్తులతో పొడిచి పొడిచి కిరాతకంగా హతమార్చారు. అంతటితో ఆగక తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. ఆ కాలంలో అంత భయంకరమైన హత్య మరొకటి లేదు. ఈ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిజాం స్వతంత్ర ప్రతిపత్తి సరికాదన్నందుకు రజాకార్లకు ఒక గొప్ప పాత్రికేయుడు బలైపోయాడు.

తెలుగువారి ఆడబిడ్డగా పేరు తెచ్చుకున్న పత్రిక  తెలంగాణాలో సుజాత. 1927లో మొదటి సంచిక వచ్చినా.. దానితోనే ఆగిపోయింది. ఆ తరువాత 50వ దశకంలో మళ్లీ ప్రారంభమై తెలంగాణాకు సాహిత్య సేవలందించింది. 1950లో గడియారం రామకృష్ణ శర్మ తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 15న తిరిగి ప్రారంభమైన ఈ సంచిక మూడేళ్ల పాటు నడిచి ఆగిపోయింది. సుజాత పత్రిక 48 పేజీలతో వచ్చేది. ఆ రోజుల్లో ఒక్కో సంచికకు నాలుగు వందల రూపాయల ఖర్చయ్యేది. దాన్ని భరించటమే కష్టమై మూసి వేయాల్సి వచ్చింది. తెలంగాణాలో సాహిత్య పత్రిక అంటే గుర్తుకు వచ్చేది సుజాతే.
వామపక్ష భావాలతో, స్పష్టమైన ఆధునిక దృక్పథంతో ‘‘సాహితీ మిత్రులు’’ వరంగల్లు నుంచి వెలువరించిన పత్రిక సృజన. 1966లో తొలి సంచిక కాళోజీ సంపాదకత్వంతో విడుదలైంది. నాలుగేళ్ల వరకూ ఆయనే సంపాదకుడుగా ఉన్నారు. ఆ తరువాత ఆ బాధ్యత, పేరు నవీన్ తీసుకున్నారు. పేరు ఎవరిదైనా పత్రికకు సంబంధించిన ప్రధాన బాధ్యతలన్నీ ప్రముఖ విప్లవకవి వరవరరావు నిర్వహించేవారు. మొదట త్రైమాసికంగా, ఆ తరువాత మాసపత్రికగా వచ్చింది. ఆయన ప్రత్యక్షంగా సంపాదకత్వ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే 1973లో అరెస్టు కావటంతో ఆయన భార్య హేమలత ఆ భారాన్ని స్వీకరించారు. 1992 వరకూ ఈ పత్రిక అవిచ్ఛిన్నంగా వస్తూనే ఉంది.
అచ్చమైన తెలుగు నగరి వరంగల్లు. ఒకప్పుడు కవులకు, ఖడ్గవీరులకూ ఇది ప్రసిద్ధి.. మేటి పోటరి జగజ్జెట్టీలను దేశవిదేశాలకు పంపించిన వీరభూమి. ఆధునిక యుగంలో కలం నడిపే మొనగాళ్లకూ ఇది కేంద్ర బిందువైంది. 1958లో ఎంఎస్ ఆచార్య జనధర్మ వారపత్రికను ప్రారంభించారు. ఆయనకు ఆ పత్రికే ఇంటిపేరుగా సార్థకమైంది. వరంగల్లుకు మంచినీటి సమస్యను పరిష్కరించిన కాకతీయ కాలువ, కాకతీయ విశ్వవిద్యాలయ స్థాపన, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం, మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు తెప్పించటం లాంటి అనేక అభివృద్ధి పనులను వరంగల్లుకు సాధించి పెట్టడంలో జనధర్మ కృషి ఉంది. ఆయన షష్టిపూర్తి సందర్భంలో  అభిమానులు పూల మాల వేయటానికి రెండు గంటలు క్యూలో నిలుచున్నారట. ఆయన కుమారుడు మాడభూషి శ్రీధర్ కూడా తొలికాలం జర్నలిస్టు. సంచలనాలకు పెట్టింది పేరు. జనధర్మ వారపత్రికను నడుపుతూనే సాహిత్య సంచికలు కూడా ప్రత్యేకంగా ప్రచురించేవారు. కోవెల సుప్రసన్నాచార్య దానికి సంపాదకత్వ బాధ్యతలను నిర్వహించారు. 1980 నాటికి వరంగల్ వాణి దినపత్రికను ఎంఎస్ ఆచార్య ప్రారంభించారు. 1994లో ఆయన మరణించేంత వరకూ ఆగకుండా నడిపించారు. ఆ తరువాత రుద్రాభట్ల కిషన్ పత్రికను కొనుక్కొని నడిపించారు. ఇప్పుడు శ్రీకృష్ణ దాని బాధ్యతలు తీసుకున్నారు.
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ పక్షాన హైదరాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక గీటురాయి. ఎస్.ఎం మాలిక్ దీని ప్రచురణ కర్త. వ్యక్తి సంస్కార, సంఘ నిర్మాణ నైతిక పథంగా గీటురాయిని మాలిక్ అభివర్ణిస్తారు.
కాకతీయ యూనివర్సిటీ 1976లో డాక్టర్ కె.వి. రామకోటిశాస్త్రి సంపాదకుడుగా, డాక్టర్ కె. సుప్రసన్నాచార్య అసోసియేట్ ఎడిటర్‌గా ప్రచురించిన వార్షిక పత్రిక విమర్శిని. ఇప్పటికీ ఏడాదికో సంచిక సాహిత్యసేవలందిస్తూ వెలువడుతోంది.
వరంగల్లు జిల్లా మహబూబాబాద్ నుంచి వెలువడుతున్న వారపత్రిక మానుకోట. సిబి లక్ష్మి ఈ పత్రికకు సంపాదకులు. గత శతాబ్దపు చివరలో ప్రారంభమైన ఈ పత్రిక ఇప్పటికీ కొనసాగుతోంది. 1956లో దేవులపల్లి సుదర్శనరావు సంపాదకులుగా కాంగ్రెస్ వారపత్రిక వరంగల్ చౌరస్తా దగ్గర ఉన్న ఆదర్శ ప్రింటర్స్ నుంచి వచ్చేది. తెలంగాణా జిల్లాల్లో చిన్న పత్రికల సంఖ్య లెక్కపెట్టలేం. ఒక్కో జిల్లాలో వందకు తక్కువ కాకుండా పత్రికలు వెలువడ్డాయంటే అతిశయోక్తి కాదు. తాజాగా తెలంగాణా కోసం తెలంగాణా వాణిని వినిపిస్తూ వెలువడుతున్న పత్రిక నమస్తే తెలంగాణా. రాజకీయ పార్టీ టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించిన పత్రిక ఇప్పుడు తెలంగాణా జన భావనలను భుజాన మోస్తున్నది.
అన్ని యిజాలలోని నిజాలను నివురు తొలగించి ప్రజల ముందుంచిన సాహసం తెలంగాణా పత్రికారంగానిది. ప్రజల్లో చైతన్యాన్ని ఉద్దీపనం చేసి కార్యోన్ముఖులను చేసేందుకు సాధనగా పత్రికారంగాన్ని ఎంచుకుని అద్భుతాలు సృష్టించిన పోతుగడ్డ తెలంగాణా. కలం పాళీతో తెలంగాణ నేలను దున్ని సాహిత్య సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమ వనాలను పెంచి స్వేచ్ఛ కోసం పౌరుషాగ్ని పుప్పొడులను వెదజల్లింది తెలంగాణ పత్రికారంగం.